జడ్పీ చైర్‌పర్సన్ ఛాంబర్ లో జగన్ ఫొటో... స్టోర్ రూమ్ వద్ద చంద్రబాబు ఫొటో!

  • అనంతపురం జడ్పీ కార్యాలయంలో ఫొటోల వివాదం
  • జడ్పీ సీఈవోపై టీడీపీ ఎమ్మెల్యేల తీవ్ర ఆగ్రహం
  • జగన్ ఫొటో తొలగించి.. గాంధీ, చంద్రబాబు ఫొటోలు ఏర్పాటు
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫొటోల ఏర్పాటు విషయంలో తీవ్ర వివాదం చెలరేగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను స్టోర్ రూమ్ పక్కన ఉంచి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోను జడ్పీ చైర్‌పర్సన్ ఛాంబర్‌లో పెట్టడంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు అనంతపురంలో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అమిలినేని సురేంద్ర బాబు, ఎంఎస్ రాజులకు ఊహించని దృశ్యం కనిపించింది. జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో మాజీ సీఎం జగన్ ఫొటో ఉండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో మాత్రం స్టోర్ రూమ్ వద్ద కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

జగన్ ఫొటోను గమనించిన వెంటనే ఎమ్మెల్యేలు జడ్పీ సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రభుత్వ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏ నిబంధనల ప్రకారం ఉంచుతారు? కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్నా మీ వైఖరి మారదా?" అంటూ సీఈవోను నిలదీశారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అంతేకాదు, జగన్ ఫొటోను అక్కడి నుంచి తొలగించి... ఆ స్థానంలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను ఏర్పాటు చేయించారు. స్వయంగా వారే సీఎం చంద్రబాబు ఫొటోను జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ ఛాంబర్‌లో పెట్టించారు.

Chandrababu Naidu
Anantapur ZP office
YS Jagan Mohan Reddy
TDP MLAs protest
Girijamma
Zilla Parishad meeting
Andhra Pradesh politics
Photo controversy

More Telugu News